శ్రీ పెద్దమ్మ ఆలయం, జూబ్లిహిల్స్

Sample Image

హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఉంది. హైదరాబాదులోని అతి పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. జంటనగరాలలో అతిపురాతనమైన ఆలయంగా పిలవబడుతున్నది.హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ప్రదాన రహదారికి సమీపంలో శ్రీపెద్దమ్మ దేవాలయం ఉంది.

జూబ్లీహిల్స్‌ లో వెలసియున్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయమని పూర్వీకుల అభిప్రాయం. వేలసంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయమున్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తోంది. మరి జూబ్లిహిల్స్ లోని శ్రీ పెద్దమ్మ దేవాలయ మహిమ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాతంలో ఉండగా, 2000సంవత్సరం నుండి ఈ ఆలయానికి ప్రాచుర్యం చాలా పెరిగింది. ఇక్కడి "అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా వుండి గ్రామదేవతగా పూజలు అందుకుంటూ వుండేదట.

హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో, సహజంగానే పల్లెవాసాలు అదృశ్య మయ్యాయి. గ్రామ దేవతగా వున్న అమ్మవారు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది.

ఆలయంలోకి ప్రవేశించటానికి ప్రవేశద్వారం మీద వున్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెబుతునట్లుగా కనబడుతుంది. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చిన్న దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని మూలగుడి అని అంటారు. ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్థుల గర్భగుడి, ఏడు అంతస్థుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి.

గర్భాలయంలో పెద్ధమ్మతల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం;త్రిశూలం;కుంకుమ భరిణ;చక్ర;ఖడ్గంతో దర్శనమిస్తుంది. అమ్మవారు నవరత్న ఖచిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడ ఇక్కడ ఉన్నారు. ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యఅభిషేకాలు ,శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి.

ఉత్సవాలు:

ఆషాడ శుద్ద సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు,దసరా రోజులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు.

ఇవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది.హైదరాబాదు సికింద్రాబాదు జంటనగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలివస్తుంటారు.

రధసప్తమి రోజున చండీ హోమం,బలిహరణం,అన్న సంతర్పణ జరుగుతాయి.బలిపీఠం వద్ద పసుపు,కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవవిగ్రహాన్ని నవరత్న ఖచిత వైడూర్య బంగారు ఆభరణాలతో ,బంగారుజడతో అందంగా అలంకరించి వెండిసింహాసనంపై కూర్చుండపెడతారు.ఎరుపు,పసుపు వస్త్రలను పరచి వేడివేడిఅన్నం నివేదన చేస్తారు.

ఆమహానివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు.ఉత్సవవిగ్రహం ముందే గుమ్మడికాయను కుంకమనీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు.ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠంపైన ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండుముక్కలు చేసి బలినివేదన చేస్తారు.