శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం, సికింద్రాబాద్

Sample Image

ఆంజనేయుడు మహా పరాక్రమవంతుడు, అపజయమే ఎరుగనివాడు. శత్రువులను సంహరించడంలోను భక్తులకు అభయమివ్వడంలోను ఆయన ఎంత మాత్రం వెనుకాడడు. ఆయన పేరు వింటేనే భూత.. ప్రేత.. పిశాచాలు కంటికి కనిపించనంత దూరం పారిపోతాయి. అంతటి శక్తిమంతుడైన ఆంజనేయుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. అలా ఆవిర్భవించిన ఆలయమే శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం.

త్రేతాయుగంలోనే ఇక్కడ స్వామి స్వయంభువుగా అవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతున్నది. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు.

స్థలపురాణం:

సికింద్రాబాద్ - బోయినపల్లి సమీపంలోని సిక్‌విలేజ్‌లో ఉంది. శ్రీ తాడుబందు వీరాంజనేయ ఆలయం వాడుకలో ఈ ప్రాంతాన్ని తాడ్‌బండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. తాడ్ బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.త్రేతాయుగంలో జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయగా ఆంజనేయుడు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు చెబుతారు. తన తపస్సుకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చూడమని మహర్షి వినాయకుడిని ప్రార్థించాడట. అందువల్ల ఇక్కడ ఆంజనేయుడితో సహా వినాయకుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.జాబాలి మహర్షి ఇక్కడ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించినట్టు తెలిసి శ్రీ రాముడు హర్షాన్ని వ్యక్తం చేసినట్టు స్థలపురాణంలో వుంది. ఆ తరువాత ఎందరో మహనీయుల రాకతో మరింత పవిత్రమైన ఈ క్షేత్రం, కాలక్రమంలో కనుమరుగైపోయింది.

ఆ తరువాత 19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేశాడు. అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయ సహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి. ఇక్కడి స్వామిని పూజించడం వల్ల ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ప్రత్యేకతలు:

ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే... హనుమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన విశేషాలు శిలాఫలకంపై ఉన్నాయి. నవ వ్యాకరణంలో చివరి నాలుగు అంకాలను పూర్తి చేయాలంటే ఖచ్ఛితంగా గృహస్తుడై ఉండాలని, ఇందుకోసం తన కమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని స్వామివారికి గురువైన సూర్యుడు సూచిస్తాడు.

ఇందుకు అంగీకరించిన ఆంజనేయుడు ఆమెను వివాహమాడతాడు. కానీ, ఆపై బ్రహ్మచారిగానే కొనసాగాడు. ఇక సువర్చల స్వామివారి ధ్యానంలోనే తన శేష జీవితాన్ని గడిపేస్తుంది. వీరిద్దరి ప్రతిమలు ఇక్కడ మనకు గోచరిస్తాయి. తాడ్‌బండ్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం స్వయంభువుడని ప్రతీతి. మొగలులు, రాజపుత్రులు, కుతుబ్ షాహీలు ఈ దేవాలయం కోసం కొన్ని అభివృద్ధి పనులు చేసినట్లు చెబుతుంటారు.

అద్భుత నిర్మాణం:

దేవాలయంలోని గర్భాలయం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. ముఖమండపం విశాలంగా ఉంటుంది. విమాన గోపురం, మహారాజ గోపురాలతో శోభాయమానంగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాకులు పలు సత్రాలను నిర్మించారు. సత్రాలతోపాటు భోజనశాలలు తదితర సౌకర్యాలు ఈ మందిరంలో భక్తుల కోసం ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో పెళ్ళి వేడుకలు, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఓ కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం అద్దెకు తీసుకున్నవారికి అధిక గదులు కేటాయిస్తారు. స్వామిని సేవించుకుని తరించే భక్తుల సంఖ్య ఏ యేటికాయేడు పెరుగుతూనే వుండటం విశేషం.