దివ్యాంగుల శ్లోకము

శ్రీ గురుభ్యోనమః
శ్రీ మహాగణాధిపతయే నమః

"సర్వథా క్రియతాం యత్నః
సీతామధి గమిష్యథ
పక్షలాభో మమాయం వః
సిద్ధి ప్రత్యయకారకః"

ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తిని అమృత శక్తి అంటారు. ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు,చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా, మంచం మీద నుంచి లేవలేకపోయినా, బాగా కఫం పేరుకుపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం మూడు సార్లు, మధ్యాహ్నం మూడు సార్లు, సాయంత్రం మూడు సార్లు చప్పున చదివితే మంచి అవయవ లాభం. కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీని వలన బాగుపడిన వాళ్ళు ఉన్నారు.

సంపాతి సీతాదేవి గురించి చెప్పాడు "మీరు వెళ్ళండి, ఆవిడ దొరికుతుంది" అని. అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎఱ్ఱగా రెక్కలు వచ్చేసాయి. అద్భుతంగా రెక్కలు వచ్చాయి. మంచి బలమైన రెక్కలు వచ్చాయి. రాముడి గురించి, సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించినా, వారికి ఉపకారం చేయాలనుకున్నా, వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి. మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఎగిరి పోయాడు. ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు. ఈ మంత్రం మహా మంత్రం. పరమ మంత్రం. చాలా పవిత్రమైన మంత్రం.

ఇందులో మొదటి అక్షరం 'స' అనేది సీతాదేవికి సంబంధించిన బీజం. తత్సవితుర్వరేణ్యంలో బీజం. అందులో ‘త్నః’ అనేది వికలాంగులను బాగు చేసేటటువంటి ధన్వంతరీ మంత్రం. 'సి' అనే మంత్రం బుద్ధి జ్ఞానాన్ని పెంచే మంత్రం. ‘ప’ కారము ఉత్సాహాన్ని పెంచే మంత్రం. ఈ బీజములను కలిపి ఈ శ్లోకములో పెట్టారు. అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు ఈ శ్లోకాన్ని రోజూ మూడు పూటలా మూడేసి సార్లు చదివేవారు. వైద్యుడు మందుని నారాయణ స్మరణ పూర్వకంగా ఇస్తే, మనం నారాయణ స్మరణ పూర్వకంగా వేసుకుంటే వెంటనే ఆరోగ్యం త్వరగా లభిస్తుంది. ఈ గొప్ప శ్లోకం భక్తులందరినీ రక్షిస్తుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా మూడు పూట్లా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు సార్లు అంటే మొత్తం తొమ్మిది సార్లు నమ్మి చేసుకుంటే ఆరోగ్యం వచ్చి తీరుతుంది.

బలం గురోః ప్రవర్ధతాం